Thursday, January 6, 2011

తబలా మాంత్రికుడు !

చల్లని సాయంత్రం వేళ...మంచుతెరల దుప్పట్లు నెమ్మదినెమ్మదిగా పరుచుకునేటి సమయాన...తాజ్‌మహల్‌ పక్కన కూర్చుని తబలా వారుుద్యాన్ని వింటుంటే ఎవ్వరైనా సరే వహ్‌...వా! అనాల్సిందే...అదే మరి తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ భాయ్‌ అరుుతే తాజ్‌ చాయ్‌ తాగుతూ...దాని రుచిని ఆస్వాదిస్తూ తన ఒత్తైన రింగుల జుత్తుతో కూడిన తలను రిథమిక్‌గా ఆడిస్తూ వహ్‌...తాజ్‌! అంటుంటే ప్రశంసించని ఏ భారతీయుడూ ఉండడు... తబలా మాంత్రికుడిగా భారత కీర్తిపతాకానిన విశ్వవిఖ్యాతం చేసిన జాకీర్‌హుస్సేన్‌ గురించి క్లుప్తంగా...

zaki 
మనకున్న అతికొద్ది మంది తబలా వాయిద్యకారులలో ఈ తరం వారికి బాగా సుపరిచితమైన పేరు జాకీర్‌హుస్సేన్‌...1951 మార్చి 9న ముంబాయిలో జన్మించిన ఈ జాతిరత్నం తండ్రి కూడా మేలిమిజాతి వజ్రమే. అప్పటికే తబలా వాయిద్యంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన అల్లారఖాకు పుట్టిన వాడే మన జాకీర్‌హుస్సేన్‌. పులి కడుపున పులే పుడుతుందని...తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు జాకీర్‌. బాల్యంలో మహిం ప్రాంతంలోని సెయింట్‌ మైఖేల్‌ హైస్కూల్‌లో విద్యనభ్యసించిన జాకీర్‌ ముంబాయిలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీనుంచి పట్టభద్రుడయ్యారు.

తండ్రే రోల్‌ మోడల్‌:
జాకీర్‌ ఇద్దరు అన్నలు తౌఫిక్‌ ఖురేషి, ఫజల్‌ ఖురేషిలకు ఇతడు ముద్దుల తమ్ముడు. అప్పటికే అన్నలిద్దరూ కూడా పెర్కూషన్‌ వాయించే కళాకారులు. కాగా జాకీర్‌ మాత్రం తన తండ్రినే రోల్‌మోడల్‌గా మలుచుకున్నారు. 12వ ఏటనుంచే తబలాను లయబద్ధంగా వాయించడం నేర్చుకున్నారు. 1970లో అమెరికాకు పయనమయ్యారు జాకీర్‌హుస్సేన్‌. అప్పుడే మొదలయ్యింది అంతర్జాతీయ వేదికలపై జాకీర్‌ ప్రస్థానం. 1973 సంవత్సర కాలంలో ఒకే సంవత్సరంలో 150కి పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు జాకీర్‌.

jakeerhussen 
1973లో జార్జిహారిసన్‌ లివింగ్‌ ఇన్‌ ద మెటీరియల్‌ వరల్డ్‌ ఆల్బమ్‌లో ప్రప్రధమంగా జాకీర్‌ చోటుదక్కించుకుని భారత జాతి ఖ్యాతి ఖండాంతరాలకి చాటిచెప్పారు. అంతేకాదు తబలా వాయిద్యంలో మొలకువల గురించి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విద్యార్థులకు, భారత్‌లోని ముంబాయి విద్యార్థులకు టీచింగ్‌ చేసేవారు. బిల్‌లాస్‌వెల్‌కు చెందిన ప్రఖ్యాత వరల్డ్‌ మ్యూజిక్‌ సూపర్‌గ్రూప్‌లో తబలా శాస్త్రంలో అధ్యాపక సభ్యునిగా కొంతకాలం తన సేవలు అందించారు. గ్లోబల్‌ డ్రమ్‌ ప్రాజెక్ట్‌లో కూడా చురుగ్గా పాల్గొని పెర్కూషన్‌ వాయిద్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేవారు.

అంతర్జాతీయ వేదికలపై...
జాకీర్‌కు 1992లో భారత్‌లో ప్రఖ్యాత గాన కళాకారుల సరసన తబలా వాయించే అవకాశం దక్కింది. 2006లో భారతదేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ అవార్డును జాకీర్‌హుస్సేన్‌ ఎంపికయ్యారు. జాకీర్‌ హుస్సేన్‌తో పాటు ప్రఖ్యాత సరోద్‌ విద్వాంసుడు ఆశిష్‌ఖాన్‌ కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం విశేషం. ఈ ఇద్దరూ కూడా సంప్రదాయ దేశీయ వాయిద్యాలను లయబద్ధంగా వాయించి అశేష జనాలను రంజింపజేసినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికచేయడం విశేషం. ఇంకా అనేక అంతర్జాతీయ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ నిర్వాహకులతో కలిసి జాకీర్‌ పనిచేయడం...భారత ప్రతిష్టను దశదిశలా వ్యాపింపజేయడం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా భారత సంప్రదాయాలకు విలువనిస్తూ మన జాతి కీర్తి ప్రతిష్టల బావుటా అంతర్జాతీయ గగనతలంపై ఎగురవేస్తూ జాకీర్‌ తబలాకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.

2008లో అమెరికాతో సహా పలు దేశాలు పర్యటించి తన తబలా వాయిద్య శక్తికి ఎదురులేదని నిరూపించారు ఆయన. జాకీర్‌ స్వయంగా తబలా ఆలపించిన అనేక అంతర్జాతీయ ఆల్బమ్స్‌ అత్యంత ప్రాచుర్యం పొందాయి. 1991లో విడుదల చేసిన ‘ది ఫస్ట్‌ ప్లానెట్‌ డ్రమ్‌’ ఆల్బమ్‌ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు ఆ ఆల్బమ్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆ ఆల్బమ్‌కు 1992లో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు సైతం లభించింది. మళ్లీ ఆదేపేరుతో అనేక మార్పులు చేసి మళ్లీ కొత్తగా విడుదల చేసిన ఆల్బమ్‌కు 2009లో తిరిగి గ్రామీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. 2009, ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డ్స్‌ కార్యక్రమంలో జాకీర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

చలనచిత్రాలకు సంగీత సహకారం:
జాకీర్‌ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలలోని పాటలకు, కొన్ని సన్నివేశాలకు కూడా తన తబలా వాయిద్యాన్ని అందించారు. 1983లో విడుదలైన హాలీవుడ్‌ సినిమా ‘హీట్‌ అండ్‌ డస్ట్‌’లో తొలిసారిగా తన వాయిద్యాన్ని పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ మర్చంట్‌ ఐవరీ ఫిల్మ్స్‌ నిర్మించింది. బాలీవుడ్‌లో స్వయంగా నటించి ఆ చిత్రానికి సంగీతాన్ని కూడా సమకూర్చారు జాకీర్‌. ఆ చిత్రం పేరు ‘వానప్రస్థం’. ఆ చిత్రం అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది.1999లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నామినేట్‌ అయింది.

ఏఎఫ్‌ఐ లాస్‌ఏంజిల్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా గ్రాండ్‌ జ్యూరీ అవార్డు పొందింది. ఇవేగాక టర్కీ దేశానికి చెందిన ఇస్థాంబుల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో, బొంబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ఆ చిత్రం ప్రదర్శితమై విమర్శకుల ప్రసంశలు పొందింది. 2000లో భారతదేశంలో జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా ఎంపికయింది.

ఇదేగాక పలు భారతీయ చిత్రాలకు జాకీర్‌ తబలా వాయిద్య సంగీతాన్ని సమకూర్చారు. ‘లిటిల్‌ బుద్ద’ అనే చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలకు తబలా సంగీతాన్ని అందించారు. అపర్ణాసేన్‌ దర్శకత్వం వహించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌’ చిత్రానికి సంగీత సహకారం అందించారు. కొన్ని చిత్రాలలో తానే స్వయంగా పాటలు పాడి అందరినీ విస్మయానందానికి గురిచేశారు. జాకీర్‌ పలు డాక్యుమెంటరీ చిత్రాలలో కూడా నటించారు. 1998లో ‘జాకీర్‌ అండ్‌ హిజ్‌ ఫ్రెండ్స్‌’, ‘జాకీర్‌హుస్సేన్‌ అండ్‌ది ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ డ్రమ్‌’ లాంటి డాక్యుమెంట్లతో సహా పలు డివీడీ చిత్రాలలో నటించి వాటికి సంగీత సహకారం అందించారు.

వ్యక్తిగతం:
జాకీర్‌ తాను స్వయంగా కళాకారుడేగాక ఆంటోనియా మిన్నేకోలా అనే కథక్‌ నృత్యకారిణిని వివాహమాడారు. ఆమె కథక్‌ నృత్యకారిణియేగాక నాట్యవిద్యాలయంలో టీచర్‌గా చేసేవారు. తర్వాత జాకీర్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే మేనేజర్‌గా కొంతకాలం పాటు వ్యవహరించారు. ఆ సందర్భంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారి అది పరిణయానికి దారితీసింది. వారికి అనీషా ఖురేషి, ఇసబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనీషా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ప్రస్తుతం ఫిలింమేకింగ్‌, వీడియో ప్రొడక్షన్‌ రంగాలను పర్యవేక్షిస్తోంది. ఇసబెల్లా మాన్‌హట్టన్‌లో సంప్రదాయ నృత్యానికి సంబంధించిన విద్యలో పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికీ జాకీర్‌ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో నిర్వహించే సెమిస్టర్స్‌కు పూర్తికాలం ప్రొఫెసర్‌గా మ్యూజిక్‌ విభాగంలో 2005-06 మధ్య పనిచేశారు.

పురస్కారాలు:
జాకీర్‌హుస్సేన్‌ లెక్కలేనన్ని దేశీయ, విదేశీయ అవార్డులు రివార్డులు అందుకున్నారు. 1998లో భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2002లో మరో ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డును కూడా అందుకోవడం విశేషం. అత్యంత పిన్నవయసులో అవార్డును అందుకున్న తబలా విద్వాంసుడిగా జాకీర్‌హుస్సేన్‌ను చెప్పుకోవచ్చు. అలాగే 1990లో అమెరికా-భారత దేశాల మధ్య సంప్రదాయ సత్సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈయనకు ‘ఇండో-అమెరికన్‌’ అవార్డును బహూకరించారు. 1991లో రాష్టప్రతి చేతులమీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డుకూడా అత్యంత పిన్నవయసులో అందుకున్న కళాకారుడిగా పేరుదక్కింది.

1992లో విడుదల చేసిన జాకీర్‌హుస్సేన్‌ విడుదల చేసిన ‘ప్లానెట్‌ డ్రమ్‌’ ఆల్బమ్‌ అంతర్జాతీయంగా విపరీతమైన క్రేజ్‌ తీసుకువచ్చి క్యాసెట్‌ అమ్మకాలలోనే ఓ వినూత్న రికార్డును సృష్టించి ప్రతిష్టాత్మక ‘గ్రామీ’ అవార్డును తెచ్చిపెట్టింది. భారతీయ సంగీతానికి లభించిన విశ్వవిఖ్యాతికి ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంచే 2006లో కాళిదాస్‌ సమ్మాన్‌ అవార్డు లభించింది. 2007 సంవత్సరంలో ‘మోడరన్‌ డ్రమ్మర్‌ అండ్‌ డ్రమ్‌’ మేగజైన్‌ నిర్వహించిన సర్వేలో ‘బెస్ట్‌ వరల్డ్‌ మ్యూజిక్‌ డ్రమ్మర్‌’గా జాకీర్‌హుస్సేన్‌ ఎంపికయ్యారు. భారతదేశ ఖ్యాతిని ఎల్లెడలా తన శాస్ర్తీయ సంగీత విద్యద్వారా వ్యాపింపజేసిన జాకీర్‌హుస్సేన్‌ మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలను అందుకుని మన జాతి కీర్తిపతాకాన్ని విశ్వవినతికెక్కించాలని...చరిత్రలో సువర్ణాధ్యాయాలతో మన పేరు లిఖించేలా చేయాలని ఆశిద్దాం...
1998లో భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ 2002లో పద్మభూషణ్‌ అవార్డును అందుకోవడం విశేషం. 1990లో అమెరికా-భారత దేశాల మధ్య సంప్రదాయ సత్సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈయనకు ‘ఇండో-అమెరికన్‌’ అవార్డును బహూకరించారు. 1991లో రాష్టప్రతి చేతులమీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు.
- నండూరి రవిశంకర్‌
జాకీర్‌ హుసేన్‌- క్యారికేచర్‌: మూర్తిగారి మధు

No comments:

Post a Comment