Thursday, June 28, 2012

నేతాజీ ఆఖరి ఘడియలు!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనకున్న మిస్టరీ ఏమిటి? ఈ ప్రశ్న గత 65 ఏళ్లుగా చాలా మందిని వేధిస్తోంది. నేతాజీ మరణం కేవలం ప్రమాదమేనని ఇప్పటి దాకా అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అయినా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదనేది కొందరి నమ్మకం. ఈ నేపథ్యంలో బోస్ మరణానికి సంబంధించి- ఇటీవల అమెరికా, రష్యా, సింగపూర్ గూఢచారి సంస్థలు విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాల ఆధారంగా అనుజ్ థార్ రాసిన పుస్తకమే ' ఇండియాస్ బిగ్గెస్ట్ కవరప్ '. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ పుస్తకంలో నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలు..

ఆగస్టు 17, 1946
"సియాగాం ఎయిర్‌పోర్టులో మిత్సుబిషి కేఐ-21 బాంబర్ సిద్ధంగా ఉంది. దీనిని అందరూ ముద్దుగా 'సెలీ' అని కూడా పిలుచుకుంటారు. సాయంత్రం 4.30కి బోస్, ఆయన సహచరులు ఎయిర్‌పోర్టుకు వచ్చేసరికి ఈ బాంబర్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. బోస్ విమానం దగ్గరకు వచ్చిన వెంటనే ఆయనకు జపాన్ సైన్యానికి చెందిన ఒక జనరల్ సెల్యూట్ చేసి స్వాగతం పలికాడు. బోస్ తన ట్రేడ్‌మార్క్ ఐఎన్ఏ టోపి, కాకీ బుష్ షర్ట్, ప్యాంట్ వేసుకొని హుందాగా ఆ వందనాన్ని స్వీకరించారు. విమానాశ్రయానికి తనతో పాటు వచ్చిన సహచరులకు వీడ్కోలు చెప్పి విమానం ఎక్కారు. ఆయన వెనకే రహమాన్ (బోస్ బాడీగార్డ్) కూడా విమానం ఎక్కాడు.

బోస్, రహమాన్‌లు ఎక్కింది ట్రాన్స్‌పోర్టు విమానం కావటంతో కూర్చోవటానికి సరైన సౌకర్యాలు లేవు. సీట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. విమానంలో సగభాగం సైనికుల సామాన్లతోనే నిండిపోయింది. పైలెట్ వెనకున్న సీటులో బోస్ కూర్చున్నారు. ఆయన వెనక సీటులో రహమాన్ కూర్చున్నాడు. వీరిద్దరితో పాటు ప్రయాణిస్తున్న జపాన్ సైనికాధికారులు మిగిలిన సీట్లలో సర్దుకొని కూర్చున్నారు. విమానం రాత్రి ఏడు గంటలకు వియత్నాంలోని డా నాంగ్ సైనిక విమానాశ్రయంలో దిగింది.

బోస్, రహమాన్, జపాన్ సైనికాధికారులు ఆ రాత్రి ఒక హోటల్‌లో బస చేశారు. 18 ఉదయాన్నే వీరందరూ టోక్యోకు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు విమానం తైవాన్ రాజధాని తైపీలో దిగింది. (విమానం 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించటం వల్ల చాలా చలిగా ఉంది.) బోస్ విమానం దిగి దూరంగా ఉన్న భవంతులను చూస్తున్నారు. ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో ఆ విమానాశ్రయం కూడా పూర్తిగా దెబ్బతింది. విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. రన్‌వేకు దూరంగా వేసిన ఒక టెంట్‌లో అందరూ లంచ్ తిన్నారు.

సమయం మధ్యాహ్నం 2.30 గంటలు
మళ్లీ అందరూ విమానం ఎక్కారు. విమానం బయలుదేరింది. మూడు నిమిషాలు గడిచిందో లేదో.. తైపీ విమానాశ్రయంలో మెయింటెనెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కెప్టెన్ నాకామూరకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే అతను కిటికీ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి రన్‌వే వైపు చూశాడు. అతని కళ్లెదుటగా ఆకాశం నుంచి విమానం ప్రొపెల్లర్, ఇంజన్ కింద పడ్డాయి. విమానం అటూ ఇటూ ఊగిపోవటం మొదలుపెట్టింది. దట్టమైన పొగ వ్యాపించింది. విమానాన్ని అదుపుచేయటంలో పైలెట్లు విఫలమయ్యారు. సెకనుకు 300 అడుగుల చొప్పున విమానం కిందకు పడిపోవటం మొదలుపెట్టింది.

మూడు వందల కిలోమీటర్ల వేగంతో రన్‌వేను తాకింది. వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. విమానంలో ఉన్న పెట్రోలు ట్యాంకు బద్దలయి ప్రయాణీకుల మీద పడింది. విమానం రన్‌వే మీద వేగంగా ప్రయాణించటం మొదలుపెట్టింది. ఒక పెద్ద రాళ్ల గుట్టను తాకి ఆగింది. విమానం కెప్టెన్ తలకు జాయిస్టిక్ (విమానాన్ని నడపటానికి ఉపయోగించే స్టీరింగ్) గుచ్చుకొని అతను మరణించాడు. జపాన్ సైనికాధికారులందరూ తీవ్రంగా గాయపడ్డారు. విమానం ముందుభాగంలో మంటలు వ్యాపించాయి. బోస్, రహమాన్‌ల వెనక సామాన్లు ఉన్నాయి. అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

వాటిని తప్పించుకొని బయటపడటానికి బోస్, రహమాన్‌లు ప్రయత్నించారు. బోస్‌ను చూసి రహమాన్ -'ఆగేసే నేతాజీ'! (ముందువైపు నుంచి నేతాజీ!) అని గట్టిగా అరిచాడు. బోస్ ముందు భాగం వైపు వచ్చారు. కాని అప్పటికే మంటలు అన్నివైపులా వ్యాపించాయి. బోస్ ఆ మంటలలోనుంచి కిందకు దూకారు. బోస్ బట్టలకు మంటలంటుకున్నాయి. బోస్ వెనకే రహమాన్ కూడా బయటకు దూకి పరిగెత్తుకుంటూ బోస్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే బోస్ శరీర పైభాగం బాగా కాలిపోయింది. తల మీద నాలుగు అంగుళాల గాయం కూడా తగిలింది. రహమాన్‌కు కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి. ఇద్దరూ సొమ్మసిల్లి ఒకరి పక్కన మరొకరు పడిపోయారు.

రహమాన్‌కు కొద్దిగా స్పృహ వచ్చింది. కళ్లు విప్పి చూసేసరికి దూరంగా విమానం కాలిపోతోంది. విమాన శకలాల మధ్యలో ఎవరో కూర్చుని ఏడుస్తున్నారు. "ఆప్ కో జాదాతో నహీ లగ్‌గయా..?'' అన్న నేతాజీ మాటలు విని రహమాన్ తల తిప్పి చూశాడు. "మీకు ఎలా ఉంది?'' అని నేతాజీని రహమాన్ ఆతృతగా అడిగాడు. "బతుకుతానన్న నమ్మకం నాకు లేదు..'' అన్నారు నేతాజీ. అప్పటికే ఆయన తల నుంచి రక్తం కారుతోంది. "మీకు ఏం కాదు. మీరు బతుకుతారు..'' అని రహమాన్ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు.

నేతాజీ ఆ మాటల్ని నమ్మలేదు. "మీరు మన దేశానికి వెళ్లినప్పుడు- నా చివర శ్వాస వరకూ దేశ స్వాతంత్య్రం కోసమే పోరాడానని ప్రజలకు చెప్పండి. వారిని పోరాటం కొనసాగించమని చెప్పండి. మనకు అతి త్వరలోనే స్వాతంత్య్రం వస్తుందనే నమ్మకం నాకుంది. మనను ఎక్కువ కాలం ఎవరూ అణిచిపెట్టి ఉంచలేరు..''అని రహమాన్‌తో నేతాజీ చెప్పారు. ఇంతలో నేతాజీని, ఇతర క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి సైనికాధికారులు ఒక లారీని తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న మిలటరీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

వెంటనే డాక్టర్లు నేతాజీకి ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో బోస్ శరీర ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదైంది. పల్స్ నిమిషానికి 120 సార్లు కొట్టుకుంటోంది. డాక్టర్లు బోస్ శరీరానికి జింక్ ఆయింట్‌మెంట్‌ను పూసి కట్లు కట్టారు. పల్స్ రేటును నియంత్రించటం కోసం రక్తాన్ని ఎక్కించటం మొదలుపెట్టారు. బోస్ రెండు సార్లు నీళ్లు అడిగి తాగారు. వార్డుకు తీసుకువచ్చిన గంట తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు రహమాన్, కొందరు డాక్టర్లు సమక్షంలో బోస్ మరణించారు...


గాంధీజీకి ఏం తెలుసు?
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బోస్ మరణం మిస్టరీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బోస్‌తో పాటు విమానంలో ఉన్న రహమాన్ పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయాడు. దీంతో ఈ కేసు ఎవరిని దృష్టినీ ఆకర్షించలేదు. అయితే బోస్ మరణం గురించి, ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి గాంధీజీకి తెలుసుననే వాదన ఒకటి ప్రచారంలో ఉండేది. దీనికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో- ఒక రోజు- కాందిశీకులపై జరుగుతున్న దాడులను ఆపటంలో ప్రభుత్వం విఫలమవుతోందని నెహ్రూ, పటేల్‌లపై గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

"నా ఇంకో బిడ్డ ఇక్కడుంటే బావుండేది..'' అని గాంధీజీ ఆవేశంతో అన్నప్పుడు- ఆ సమావేశంలో పాల్గొన్న మరో నేత- "నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు'' అని గుర్తు చేశారు. వెంటనే గాంధీజీ ఆయన వైపు తిరిగి "నీకెవరు చెప్పారు. అతను రష్యాలో ఉన్నాడు'' అని సమాధానమిచ్చారు. ఈ ఒక్క చోటే కాదు చాలా సార్లు నేతాజీ బతికే ఉన్నాడని గాంధీ చెబుతూ ఉండేవారు.
  - ఇండియాస్ బిగ్గెస్ట్ కవరప్
రచయిత: అనుజ్ థార్, పబ్లిషర్: మానస్ పబ్లికేషన్స్
ధర: రూ. 600, పేజీలు: 587

No comments:

Post a Comment